14 ఉద్యోగం చేస్తూ చదివాను…
ఉద్యోగం చేస్తూ చదువుకోవడం వల్ల ప్రపంచజ్ఞానంతో పాటు సమాజం గురించిన అవగాహన కూడా నాలో సహజంగానే పెరిగింది. మా అమ్మ ఇంట్లో వంట పనులు చూసేది. నేను బయట పనులు చేసేదాన్ని. వాటివల్ల ప్రాక్టికల్ జీవితానికి సంబంధించిన పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. వల్లెలో పెరిగిన దానిని కావడం వల్ల ‘ఇన్బిల్ట్ ఇన్నోసెన్స్’ నాలో బాగా ఉండేది. అంతెందుకు ఉద్యోగాలకు పోటీ పరీక్షలు రాయాలని ముందర నాకు తెలియదు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ప్రవేశంవల్ల లోకం పోకడ బాగా అవగతం చేసుకున్నాను. వార్తాపత్రికలు చదవడం అప్పుడే బాగా అలవాటైంది. అప్పుడే గ్రూప్-I పరీక్షల గురించి తెలిసింది. ఎలా అయినా ఈ పరీక్ష
రాయలని నిశ్చయించుకున్నాను. ఓపెన్ యూనివర్సిటీ క్లాసులు మాకు కాచిగూడలో జరిగేవి. ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. పోటీ పరీక్షలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెటీరియల్ బాగా ఉపయోగపడుతుంది. ఇది నా ఒక్కదాని అనుభవంతో అంటున్న మాటలు కాదు, ఎందరో నా దగ్గర వ్యక్తం చేసిన అభిప్రాయం. దీని విద్యా ప్రమాణాలు కూడా చాలా బాగా ఉంటాయి. ఇది చెప్పకపోతే నేను సాధించిన విజయానికి సంబంధించిన ఒక ముఖ్య కారకాన్ని చెప్పకుండా ఉన్నట్టవుతుంది, అందుకే చెపుతున్నాను. నా విజయానికి ఇంకొక ముఖ్య కారణం కూడా ఉంది. ఎన్ని ముఖ్యమైన పనులున్నా ఓపెన్ యూనివర్సిటీ క్లాసులకు మటుకు తప్పనిసరిగా హాజరయ్యేదాన్ని, ఉద్యోగ విధులను నిర్వహిస్తూనే చదువును కొనసాగించడంలో క్రమశిక్షణతో వ్యవహరించాననే చెప్పాలి. చిక్కడపల్లిలోని సిటీ గ్రంధాలయానికి క్రమం తప్పకుండా వెళ్ళేదానిని. రోజులో కనీసం ఒక గంటైనా లైబ్రరీలో గడవకపోతే నాకు ఎలాగో ఉంటుంది. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు. ఓపెన్ యూనివర్సిటీ పాఠాలు బోధించిన ఉపాధ్యాయులతో పాటు నన్ను ఎంతో ప్రోత్సహించిన మరో వ్యక్తి మా మామయ్య, ప్రముఖ కవి శివారెడ్డి. నన్ను అనుక్షణం ‘చదువు మానొద్దు, చదువుకుంటే అనుకున్నది సాధించగలగుతావు’ అని ఆయన చెప్పారు.
ఇష్టమైందే చదివాను…
ఉద్యోగం చేసుకుంటూ చదువుకునే క్రమంలో నాదైన సొంత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నాను. ఆర్థిక ఇబ్బందులున్నాయి కదా అని ఏనాడూ మానసికంగా బలహీనపడలేదు. చదువు ఆపేయాలని అనుకోలేదు. కష్టాలు పడితేనే కదా అనుకున్నది సాధించగలగలుగుతాము. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతాం. రెసిడెన్షియల్ స్కూల్లో కొంతకాలం చదివాను కదా. అది నాకు క్రమశిక్షణతో జీవించడాన్ని నేర్పింది, చేయాలనుకున్న పనిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా పూర్తిచేయడం అబ్బింది. నేను సమయ పాలన ఖచ్చితంగా పాటిస్తాను. రెసిడెన్షియల్ స్కూల్లో చదవడం వల్ల మరో మంచి గుణం కూడా ఒంటబట్టింది. అప్పుడు విద్యార్థులు ప్రతిరోజూ ఒక గంటపాటు తప్పనిసరిగా లైబ్రరీలో కూర్చుని చదవాలి. జనరల్ నాలెడ్జ్ పుస్తకాల మీద ఆసక్తి పెరగడం, వాటిని చదవడం నాకు రెసిడెన్షియల్ స్కూల్లో ఉండగా అలవాటైందే. ఆ అలవాటు ఇప్పుడు నా కెరీర్కే దిక్సూచి అయింది. పెద్దలు చెప్పినట్టు చదివింది ఇంటర్ వరకే. ఆ తర్వాత ఏం చదిவினా నా ప్లానింగ్కి అనుగుణంగానే చేసుకుపోయాను. నా కిష్టమైన చదువునే చదివాను. నేను గ్రూప్-1 ఎంచుకోవడం వెనుక కూడా ఒక స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశం ఉన్నాయి. నేను డిప్యూటీ కలెక్టర్గా చేపట్టబోయే విధులు ప్రజా సంబంధాలతో ముడిపడి ఉన్నవే. ప్రజల కోసమే మేమున్నామన్న స్ఫూర్తిని విడనాడకుండా విధులు నిర్వహించేవారు ప్రజల మెప్పు పొందే అధికారులవుతారని నా అభిప్రాయం. నా వరకు నేను నా విధుల్లో చేయగలిగింది చేయడానికే ప్రయత్నిస్తాను. ప్రజలకు న్యాయం చేయడమే నా ప్రయారిటీ. ఎక్కువ మందికి సహాయపడాలనే
ఇందులోకి రావాలనుకున్నాను. చేయాలనుకున్న పనిని సక్రమంగా చేయాలన్నదే నా ప్రస్తుత లక్ష్యం.